ఏఐ వీడియోలతో నా ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు: హైకోర్టులో గంభీర్ పిటిషన్

  • డీప్ ఫేక్ వీడియోల వల్ల తన పరువుప్రతిష్ఠలకు భంగం వాటిలుల్లుతోందన్న గంభీర్
  • తన ముఖం, పేరు, గొంతును ఉపయోగించి నకిలీ వీడియోలు సృష్టిస్తున్నారని వెల్లడి
  • వ్యక్తిత్వ పరిరక్షణతో పాటు రూ.2.5 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలంటూ విజ్ఞప్తి
  • 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. కృత్రిమ మేధ (ఏఐ)తో సృష్టించిన డీప్ ఫేక్ వీడియోల వల్ల తన పరువుప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతోందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆన్‌లైన్‌లో తన గుర్తింపు దుర్వినియోగం చేయడంపై రక్షణ కోరాడు. తన ముఖం, పేరు, గొంతును ఉపయోగించి నకిలీ వీడియోలు, అనధికారిక కంటెంట్ విపరీతంగా పెరిగిపోయిందని అందులో పేర్కొన్నాడు.

తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణతో పాటు రూ.2.5 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని ఆ పిటిషన్‌లో కోరాడు. అలాగే డీప్ ఫేక్ కంటెంట్‌ను తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. ఇది వ్యక్తిత్వ హననం మాత్రమే కాదని, ఏఐని వినియోగిస్తున్న సమయంలో చట్టం, గౌరవానికి సంబంధించిన అంశంగా పరిగణించాలని అన్నాడు. తన గుర్తింపు, పేరు, తన స్వరాన్ని ఆయుధంగా ఉపయోగించి అనధికారిక ఖాతాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నాడు. తన పేరును వినియోగించి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని కోర్టుకు తెలిపాడు.

గంభీర్ మాట్లాడినట్లుగా పలు డీప్ ఫేక్ వీడియోలను సృష్టించారు. గౌతమ్ గంభీర్ తన ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశాడంటూ ఓ వీడియో వైరల్ కాగా దానికి 29 లక్షల వ్యూస్ వచ్చాయి. మరో వీడియోలో సీనియర్ క్రికెటర్లపై అసభ్యకరంగా మాట్లాడినట్లు ఉంది. ఈ వీడియోను 17 లక్షల మందికి పైగా చూశారు. దీనితో 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ హైకోర్టులో గంభీర్ పిటిషన్ దాఖలు చేశాడు.

Gautam Gambhir
AI deepfake videos
defamation
Delhi High Court
reputation damage
fake content
online impersonation

More Telugu News